Lingusamy: చెక్‌ బౌన్స్‌ కేసు.. డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

13 Apr, 2023 17:49 IST|Sakshi

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్‌ బౌన్స్‌ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్‌ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్‌ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.

చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్‌ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్‌ బౌన్స్‌ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్‌ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్‌ దాఖలు చేశాడు.

ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్‌ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్‌ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్‌ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్‌లో షేర్‌ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్‌ పోతినేనితో వారియర్‌ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

మరిన్ని వార్తలు