రాజకీయాలతో సంబంధం లేదు

24 Nov, 2023 06:25 IST|Sakshi

– తేజా మార్ని

‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్‌’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్‌ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్‌ తేజా మార్ని అన్నారు. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.

ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది.  కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్‌ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్‌ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్‌ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు