Mahesh Babu: మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి స్వస్థలమేదో తెలుసా?

29 Sep, 2022 14:02 IST|Sakshi

బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ సతీమణి, హీరో మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదఛాయలు అలుము కున్నాయి. మండలంలోని ముసలిమడుగు ఆమె స్వగ్రామం. కృష్ణను వివాహమాడాక పిల్లలు రమేష్‌బాబు, మహేష్‌బాబులతో తరచుగా ముసలిమడుగు వచ్చివెళ్లేవారు. ఆమె ఎప్పుడు వచ్చినా అందరినీ అప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇప్పటికీ ముసలిమడుగులో ఇందిరాదేవి పేరిట ఇల్లు ఉంది. పక్కనే ఉన్న లక్ష్మీపురంలో ఇందిరాదేవితోపాటు ఆమె కుమారులు, కుమార్తెల పేరిట వ్యవసాయ భూములున్నాయి. ఇందిరాదేవి పేరిట ఉన్న ఇంటి స్థానంలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం వసతిగృహం నిర్మించాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రతువును మహేష్‌బాబు నిర్వహించారు.
(చదవండి: మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌)

మరిన్ని వార్తలు