దృశ్యం సీక్వెల్‌: వెంకీ అభిప్రాయమేంటో?

9 Feb, 2021 10:51 IST|Sakshi

మలయాళంలో 2013లో వచ్చిన సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం దృశ్యం. థ్రిల్లర్‌ కథాంశం, సస్పెన్స్‌ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్‌ చేశాయి. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్‌ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్‌ అయింది. చైనీస్‌ భాషలోనూ రీమేక్‌ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్‌ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్‌, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్‌ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. 

దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్‌ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్‌ చేస్తుండటంతో వెంకటేశ్‌కు దాదాపు రీమేక్‌ ఛాన్స్‌ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్‌ తెలుగు రీమేక్‌ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్'‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్‌ తేజ్‌తో కలిసి చేస్తున్న 'ఎఫ్‌ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది.

చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్‌..

కేజీఎఫ్‌ 2 బిజినెస్‌ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా?

మరిన్ని వార్తలు