టాలీవుడ్‌ నటుడుకి కత్తులు, గన్‌తో బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు

8 Jul, 2022 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం కేరవెళ్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 14, 15, 16, 17, 18, 19లలో 29.19 ఎకరాల పొలాన్ని హైదరాబాద్‌కు చెందిన నటుడు రణధీర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈయన పేరున ధరణి పట్టాదారు పాస్‌బుక్కులు సైతం వచ్చాయి. కొనుగోలు చేసిన పొలంలో పంటలు వేశారు. అందులో చుట్టూ కంచె వేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్‌ హైమద్‌ పనులను అడ్డుకున్నాడు.

అంతటితో ఆగకుండా తనవద్ద ఉన్న గన్‌ తీసి బెదిరించాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు సైతం కత్తులతో రణధీర్‌రెడ్డిని భయబ్రాంతులకు గురిచేశారు. గతంలోనూ హైమద్‌ రైతులను బెదిరించి ఇక్కడ ఓ షెడ్‌ నిర్మించాడు. గుంపులుగా గుర్రాలపై తిరుగుతూ తమతో పాటు ఇక్కడ భూములను కొనుగోలు చేసిన వారిని భయపెడుతూ.. కబ్జాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైమద్‌ తన అనుచరులతో వచ్చి గన్, కత్తులతో తమను బెదిరించాడని రణధీర్‌రెడ్డి చన్గోముల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

గన్‌ స్వాధీనం..  
సుల్తాన్‌ హైమద్‌ వద్ద గన్‌ ఉన్నది వాస్తవమేనని.. అది లైసెన్సుడ్‌ గన్‌ అని చన్గోముల్‌ ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. నటుడు రణధీర్‌రెడ్డి 29.19 ఎకరాలు కొనుగోలు చేశాడని, అతని వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయని చెప్పారు. హైమద్‌ మాత్రం తన పూర్వికులకు సంబంధించిన భూమి అని కబ్జాలో ఉన్నాడన్నారు. అతని నుంచి గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  
చదవండి: Dhanush: నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు

మరిన్ని వార్తలు