దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇక 'ఆర్ఆర్ఆర్' విడుదల నేపథ్యంలో ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో తారక్, చరణ్ అభిమానులంతా బిజీ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కోదాడలోని ఓ పముఖ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య పరస్పరం ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. ఇక దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టడం చూసిన స్థానికులు, తోటి అభిమానులు అతడిని వారించి అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టినట్టు సమాచారం. అనంతరం ఘర్షణకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇక దీంతో 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రదర్శనకు రెడీ అవుతోన్న సదరు థియేటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.