అందుకే బ్రేక్‌ తీసుకుంటున్నా: కపిల్‌ శర్మ

29 Jan, 2021 09:35 IST|Sakshi

ముంబై: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతున్న కామెడీ షో ‘ది కపిల్‌ శర్మ షో’  కొన్నాళ్లపాటు వాయిదా పడనుంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారాలు నిలిచిపోనున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కపిల్‌ శర్మ నిర్ధారించారు. అయితే పూర్తిగా షో ముగిసిపోదని, చిన్న బ్రేక్‌ మాత్రమేనని అతడు పేర్కొన్నాడు. అదే విధంగా.. తాము త్వరలోనే మరో బుల్లి అతిథిని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నామంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా కపిల్‌ శర్మ గురువారం ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. (చదవండి: కమెడియన్‌కు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!)

ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... ‘‘అవును కపిల్‌ శర్మ షోకి చిన్న విరామం ఇస్తున్నా. అంతేగానీ పూర్తిగా కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా భార్యకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మా రెండో బిడ్డ త్వరలోనే ప్రపంచంలోకి రానుంది. అందుకే ఈ బ్రేక్‌’’ అని కపిల్‌ శర్మ స్పష్టం చేశాడు. ఇక తమకు పుట్టబోయేది పాపైనా, బాబు అయినా ఫర్వాలేదని, అనైరాకు తోబుట్టువు రావడమే సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు. కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్‌ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. 

అంతేగాకుండా.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను కపిల్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది.  

మరిన్ని వార్తలు