Karthik Varma Dandu: రెండ్రోజుల్లో షూటింగ్‌ అనగా సాయిధరమ్‌​ తేజ్‌కు యాక్సిడెంట్‌.. సినిమాను ఇతర భాషల్లో..

26 Apr, 2023 08:05 IST|Sakshi

ఇటీవలి కాలంలో హారర్‌ కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ ఓ స్ట్రిక్ట్‌ అండ్‌ హానెస్ట్‌ హారర్‌ ఫిలిం రాలేదు. అందుకే హారర్‌ జానర్‌కు అభిమానిని అయిన నేను విరూపాక్ష తీశాను. ప్రేక్షకులను థ్రిల్‌ చేయాలని సినిమాలోని మర్డర్‌ సీక్వెన్స్‌లను కొత్తగా డిజైన్‌ చేశాం అన్నారు దర్శకుడు కార్తీక్‌ దండు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం విరూపాక్ష. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజైంది.

ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కార్తీక్‌ మాట్లాడుతూ.. 2016-17 సమయంలో ఓ పేపర్‌లో ఒక ఆర్టికల్‌ చదివాను. చేతబడి చేస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేస్తారు. ఆమెకు నిజంగా చేతబడి చేసే శక్తులు ఉంటే ఏం జరుగుతుందని ఊహించి విరూపాక్ష కథ రాశాను. నా కథను నమ్మిన సుకుమార్‌ గారు స్క్రీన్‌ప్లే అందించి, తాను ఓ నిర్మాతగా ఉంటానన్నారు. అలాగే సాయితేజ్‌గారిని హీరోగా నిర్ణయించి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ గారిని నిర్మాతగా నిర్ణయించారు.

అయితే విరూపాక్ష షూటింగ్‌ను మరో రెండు మూడు రోజుల్లో మొదలు పెడదామనుకున్న సమయంలో సాయిధరమ్‌ తేజ్‌ గారికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సినిమా పరిస్థితి ఏంటో అని మెంటల్‌గా నాకు నేను కోమాలోనే ఉన్నట్లనిపించింది. సాయితేజ్‌ గారికి అంతా బాగానే ఉందని చెప్పగానే రిలాక్స్‌ అయ్యాను. విరూపాక్ష విడుదలయ్యాక చాలామంది నిర్మాతలు ఫోన్‌ చేశారు. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాం అన్నారు.

మరిన్ని వార్తలు