ఇప్పుడు మా అమ్మ నాతో లేరు.. అమితాబ్‌ దగ్గర సోనూసూద్‌ ఎమోషనల్‌

14 Nov, 2021 10:02 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా ఉన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’తాజా ఎపిసోడ్‌లో సోనూసూద్‌, కపిల్‌ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్‌ సూద్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు సోనూసూద్‌. ‘మా అమ్మగారికి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ నాకు ఉత్తరాలు రాసేవారు అమ్మ. ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం.. అయినా ఉత్తరాలెందుకు? అని మా అమ్మ గారిని ఓ సందర్భంలో అడిగాను. ‘నేను నిన్ను విడిచి వెళ్లిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి. ఫోన్‌ రికార్డ్స్‌ చెరిగిపోతాయి’అన్నారు.

మా అమ్మ రాసిన లేఖలు(దాదాపు 25)నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ నాతో లేరు. కానీ ఆ ఉత్తరాలు చదువుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నేను కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’ అన్నారు సోనూసూద్‌. అలాగే సరోజ్‌ రాసిన ఓ లేఖను షోలో చదివి వినిపించారాయన.

మరిన్ని వార్తలు