హీరోయిన్‌తో డైరెక్ట్‌గా జూమ్‌కాల్‌లో మాట్లాడే అవకాశం

15 Jul, 2021 13:04 IST|Sakshi

సినిమాలు ప్రమోట్‌ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌ను అనుసరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం సోషల్‌ మీడియాకే జై కొడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం సోషల్‌ మీడియాను తెగ వాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్‌ బ్యూటీ కృతి కర్బందా సైతం చేరింది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ట్రైలర్‌ ఇటీవలె విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా తన మూవీని ప్రమోషన్‌లో భాగంగా ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది కృతి. ఈ మూవీ ట్రైలర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని, అయితే ట్రైలర్‌లో తమకు నచ్చిన విషయాలేంటో చెప్పాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తారో వారితో జూమ్‌ కాల్‌లో మాట్లాడతానని అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. 

ఇక  కృతి తెలుగులో తీన్‌మార్‌, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్  అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

>
మరిన్ని వార్తలు