కన్నడ రాజ్‌కుమార్‌ వారసత్వం

28 Jul, 2021 10:26 IST|Sakshi

దివంగత ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్‌ మనవరాలు, కన్నడ యాక్టర్‌ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్‌ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్‌ హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. కన్నడ చిత్రం ‘నిన్నా సానిహకే’లో హీరోయిన్‌గా నటించారు ధన్య. కోవిడ్‌ వల్ల రిలీజ్‌ వాయిదా పడింది. ఈలోపు కోలీవుడ్‌ నుంచి కాల్స్‌ అందుకుంటున్నారట ధన్య. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్‌ కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వస్తున్న తొలి హీరోయిన్‌ ధన్యా రామ్‌కుమార్‌నే కావడం విశేషం.

ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే నా కుటుంబానికి చెందిన అమ్మాయిలకు, బయటివారికి నేనొక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. కారణాలు ఏమైనా మా ఫ్యామిలీ మహిళలు సినిమాల్లోకి రాలేదు. మా తాతగారు (రాజ్‌కుమార్‌) ఒప్పుకోకపోవడం వల్లే అని కొందరు అంటున్నారు. కానీ ఈ విషయం గురించి మా అమ్మని అడిగితే, ఏవో భద్రతాపరమైన కారణాలు అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ‘మీటూ’ అంటూ నిర్భయంగా మాట్లాడుతున్నట్లు అప్పట్లో నటీమణులకు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చు. కానీ మా తాతగారు ఇప్పుడుంటే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని నేను హీరోయిన్‌గా చేయడానికి ఒప్పుకునేవారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు