Mahesh Babu AMB: 50 ఏళ్ల నాటి థియేటర్‌ స్థానంలో మహేశ్‌ బాబు AMB సినిమాస్‌.. ఎక్కడో తెలుసా?

17 Sep, 2023 14:14 IST|Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్‌ కపాలి స్థానంలో AMB

49 ఏళ్ల చరిత్ర ఉన్న కపాలి థియేటర్‌ 

ఒకే సినిమా 30 సార్లు విడుదల

బెంగళూరులో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించిన కపాలి సినిమా థియేటర్‌ 3 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారు. గాంధీనగర్‌లో గతంలో కపాలి థియేటర్ ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక మాల్‌ను నిర్మిస్తున్నారు. అక్కడ AMB మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. కపాలి సినిమా థియేటర్‌  స్థానంలో ఇప్పుడు మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ రావడం కన్నడ సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కన్నడ చిత్రసీమలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలకు సాక్షిగా నిలిచిన 'కపాలి' థియేటర్ నేలమట్టం కావడంతో కొంతమేరకు సినీజనాలను కలిచివేసింది.

(ఇదీ చదవండి: అనిరుధ్‌తో కీర్తి సురేష్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి)

కానీ కపాలి థియేటర్‌ కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించడంతో దానిని రీమోడల​ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతిమంగా అక్కడ మల్టీప్లెక్స్‌లు నిర్మించడం జరిగిపోతుంది. ప్రిన్స్‌ మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో పాటు హైదరాబాద్‌లో AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌లను నడుపుతున్నాడు. ఇప్పుడు వారు బెంగళూరులో కూడా AMB ప్లాన్‌ చేశారు.

ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్‌ కపాలి
1968లో సుబేదార్ చత్రం రోడ్డులో 44,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో కపాలి సినిమా నిర్మించబడింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ సినిమాను ప్రారంభించారు. కపాలి ప్రారంభంలో మొత్తం 1,465 సీట్లతో ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్లలో ఒకటి. కపాలి థియేటర్ యజమానులుగా ఉన్న దాసప్ప సోదరులు 4 సంవత్సరాల క్రితం థియేటర్ స్థలాన్ని బెల్గాం వ్యాపారికి విక్రయించారు. చివరకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జయన్న కపాలి సినిమాను లీజుకు తీసుకున్నారు. 5 సంవత్సరాల లీజు గడువు ముగిసిన తర్వాత థియేటర్ విక్రయించబడింది.

కన్నడలోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు సినిమాలు కూడా కపాలీ థియేటర్‌లో విడుదలయ్యాయి. డా. రాజ్‌కుమార్ నటించిన చాలా సినిమాలు ఈ థియేటర్‌లో విడుదలయ్యాయి. కపాలిలో శతదినోత్సవం జరుపుకున్న తొలి సినిమా 'మణ్ణిన మగ', హాలు జెను. ఈ  సినిమాల విడుదల సందర్భంగా భారీ కటౌట్‌లను థియేటర్‌ వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కటౌట్ ట్రెండ్ మొదలైంది.

ఆ సినిమా 30 సార్లు విడుదల
శివన్న-ఉపేంద్ర జంటగా నటించిన ‘ఓం’ సినిమా కపాలి థియేటర్లలో 30 సార్లు విడుదలైంది. రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగల్' కూడా ఇదే థియేటర్‌లో విడుదలైంది. మొదట్లో సీటింగ్ కెపాసిటీ 1,465 ఉండగా, తర్వాత 1,112కి తగ్గించారు. 2017లో విడుదలైన 'హులిరాయ' సినిమానే కపాలి థియేటర్లో చివరిగా ప్రదర్శించబడిన చిత్రం. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల దీనిని విక్రయించేశారు.

49 సంవత్సరాల తర్వాత క్లోజ్‌
దశాబ్దాల క్రితం గాంధీనగర్‌లో 10కి పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు సంతోష్, నర్తకి, త్రివేణి, అనుపమ థియేటర్లు మాత్రమే మిగిలాయి. 49 సంవత్సరాల తర్వాత, కపాలి థియేటర్ దాని తలుపులను శాశ్వతంగా మూసివేశారు. ఆ తర్వాత దానిని నేల మట్టం చేశారు. ఇప్పుడు అక్కడ పెద్ద ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభమవుతుందని పెద్ద హోర్డింగ్ కూడా నిలబెట్టారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో 5 నుంచి 6 మల్టీప్లెక్స్ స్క్రీన్లు అక్కడ రానున్నాయి. మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా ఎన్నో వెంచర్లలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని రోజుల క్రితమే సినిమా మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు.

కన్నడ సినిమాకు ప్రాధాన్యత 
హైదరాబాద్‌లో ఏఎమ్‌బి సినిమాస్ సక్సెస్ కావడంతో మహేష్ బాబు ఆ చైన్‌ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితమే బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి మల్టీప్లెక్స్‌లలో కన్నడ సినిమాలకు తొలి ప్రాధాన్యం లభించకపోవడం బాధాకరం. కానీ మహేశ్‌ బాబు మాత్రం అక్కడ తొలి ప్రాధాన్యం కన్నడ సినిమాలకు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమచారం.

మరిన్ని వార్తలు