Maidan Movie: కోట్ల బడ్జెట్‌.. రిలీజ్‌కు నోచుకొని స్టార్‌ హీరో సినిమా!

7 Oct, 2023 14:45 IST|Sakshi

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్‌కు చాలా ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. షూటింగ్‌ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్‌ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్‌కే నోచుకోవు. 

కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్‌ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్‌ తర్వాత అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్‌కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు.


మూడేళ్ల క్రితమే షూటింగ్‌ పూర్తి.. ఆర్‌ఆర్‌ఆర్‌తో పోటీ
బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ హీరోగా,  బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కోచ్, మేనేజర్‌ (1950 –1963 సమయంలో) సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్‌ రవీంద్రనాథ్‌. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. 

రిలీజ్‌ కష్టమేనా
బోనీ కపూర్‌ భారీ బడ్జెట్‌తో మైదాన్‌ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్‌ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్‌ వేశారు. అయితే లాక్‌డౌన్‌తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్‌ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము  కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు.

రెండేళ్ల క్రితమే రిలీజ్‌ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్‌ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్‌లోకి రావడం కష్టమే.

మరిన్ని వార్తలు