ఆ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతూనే ఉంటా : మంచు విష్ణు

24 Apr, 2021 18:10 IST|Sakshi

ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్‌ స్టంట్లను డూప్‌లతో చేయించేవారు. యాక్షన్‌ సీన్లు చేయడానికి హీరోలు ముందుకు వచ్చేవారు కాదు. అందుకే డూప్‌లతో ఆ సీన్లను చేచేశారు. కానీ ఇప్పడు పరిస్థితి మారింది. ఇప్పటి యంగ్‌ హీరోలంతా స్వయంగా స్టంట్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. రిస్క్‌ అని తెలిసినా.. తామే చేస్తామని తెగేసి చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఆ స్టంట్లే ప్రాణాల మీదకు తెస్తాయి.

చాలా సందర్భాల్లో యాక్షన్‌ సీన్లలో హీరోలకు ప్రమాదాలు జరిగాయి. అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తుకు చేసుకున్నాడు హీరో మంచు విష్ణు. మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ సీన్‌ షూటింగ్‌లో మంచు విష్ణుకు గాయాలయ్యాయి. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు మంచు విష్ణు. 

‘నాకు బాగా గుర్తుంది. ఈ యాక్షన్‌ సీన్‌ వద్దని స్టంట్‌ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ని హెచ్చరించాను. కానీ వారు వినలేదు. వారి బలవంతంలో ఆ యాక్షన్‌ చేయడానికి అంగీకరించక తప్పలేదు.  ప్రగ్యా జైశ్వాల్ ప్రాణాల్ని కూడా రిస్క్‌లో పెట్టినందుకు నాపై నాకే ఇప్పటికీ కోపం వస్తుంటుంది. అయితే అదృష్టవశాత్తు ఆమె బాగానే ఉంది. నా జిమ్నాస్టిక్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కారణంగానే నేను తలకు ఎలాంటి దెబ్బ తగిలించుకోకుండా బయటపడ్డాను. ‘టంబుల్’ ట్రైనింగ్ అంటే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అదే ఆ రోజు మమ్మల్ని రక్షించింది. నా భార్య విరోనిక అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. నా విషయం ఆమెను చాలా భయపెట్టింది. ఇప్పటికీ నేను ఆ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతూనే ఉంటా. ఈ ఘటన నాకొక గుణపాఠంగా మారింది’ అని మంచు విష్ణు పేర్కొంటూ.. షూటింగ్‌ సంబంధిన వీడియోని పోస్ట్‌ చేశాడు.

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

మరిన్ని వార్తలు