నాన్నగారి ప్యాషన్‌ మమ్మల్ని నిలబెట్టింది

5 Dec, 2023 00:21 IST|Sakshi
శరత్‌ మరార్, రాజీవ్‌ చిలక, అల్లు అరవింద్, శ్రీనివాస్‌ చిలక

అల్లు అరవింద్‌

‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్‌ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్‌ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

యానిమేషన్‌ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్‌ గోల్డ్‌ గ్రూప్‌ అధినేతలు రాజీవ్‌ చిలక, శ్రీనివాస్‌ చిలక ‘చిలకప్రోడక్షన్‌’ బ్యానర్‌ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్‌ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్‌ మరార్‌ విడుదల చేశారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘రాజీవ్‌ చేసిన ‘చోటా భీమ్‌’ని నేను తెలుగులో రిలీజ్‌ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్‌ని రాజీవ్‌లో చూశాను’’ అన్నారు.

‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్‌లకు అభినందనలు’’ అన్నారు శరత్‌ మరార్‌. రాజీవ్‌ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్‌ కింగ్‌’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్‌ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్‌ గోల్డ్‌ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్‌లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘

‘2004లో కృష్ణ యానిమేషన్‌ సిరీస్‌ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్‌’ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్‌ని స్టార్ట్‌ చేశాం’’ అని శ్రీనివాస్‌ చిలక అన్నారు.

>
మరిన్ని వార్తలు