వారి ఆనందం చూస్తుంటే తృప్తిగా ఉంది 

15 Jan, 2024 00:38 IST|Sakshi
విజయ్‌ బిన్నీ, ‘అల్లరి’ నరేశ్, నాగార్జున, ఆషిక, శ్రీనివాస 

నాగార్జున 

‘‘నా సామిరంగ’ సినిమాని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, నా అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది’’ అని హీరో నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్‌ థిల్లాన్‌ కీలక పాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నా సామిరంగ’ థ్యాంక్స్‌ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ–‘‘మా చిత్రం సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పం, ప్రేమతో యూనిట్‌ అంతా పని చేశారు.. అందుకే ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. విజయ్‌ బిన్నీకి గొప్ప భవిష్యత్‌ ఉంటుంది. శ్రీనివాసా చిట్టూరి, పవన్‌ కుమార్‌లు గొప్ప ప్రోత్సాహం అందించారు. ఆషికా రంగనాథ్‌కి తెలుగులో చాలా మంచి కెరీర్‌ ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన నటుడు నాగార్జునగారితో నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ‘‘ఈ సినిమాలో వింటేజ్‌ నాగార్జునగారిని చూపిస్తానని మాటిచ్చాను.. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్‌ బిన్నీ అన్నారు. ఆషికా రంగనాథ్, కెమెరామేన్‌ దాశరధి శివేంద్ర మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు