Natyam Teaser: బెస్ట్‌ విషెస్‌ చెప్పిన యంగ్‌ టైగర్‌

10 Feb, 2021 14:21 IST|Sakshi

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ‘నాట్యం’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు, నాట్యం చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని చెబుతూ బుధవారం ఎన్టీఆర్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాట్యం ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటోంది. ‘ఏం చేస్తున్నావ్ అని చిన్నారి అడగ్గా ఒక కథ త‌యారు చేస్తున్నా’ అని ఆదిత్య మీనన్‌ చెప్తాడు.

‘మ‌నం  క‌థ‌ను వింటాం క‌దా.. అదే క‌థ‌ను మ‌న కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం’ అంటూ ఆదిత్య‌మీన‌న్ నాట్యం ప్రాధాన్య‌ం ఆ చిన్నారికి వివరిస్తూ టీజర్‌ ఉంది. కూచిపూడి నృత్యం నేపథ్యంలో ‘కాదంబరి’ అనే పాత్ర చుట్టూ ఈ సినిమా ఉండనుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. సంధ్యా రాజ్‌, కమల్‌ కామరాజ్‌ ప్రధాన పాత్రలుగా నిశ్రుంకుల ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. రోహిత్‌ బెహల్‌, భానుప్రియ, శుభలేఖ సుధాకర్‌, జబర్దస్త్‌ దీవెన, హైపర్‌ ఆది తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


>
మరిన్ని వార్తలు