Manoj Bajpayee: హోటల్‌లో ఆ నటుడు నా చెప్పులు దొంగిలించాడు..

31 Mar, 2023 21:30 IST|Sakshi

మనోజ్‌ బాజ్‌పాయ్‌, పంకజ్‌ త్రిపాఠి.. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో తమ టాలెంట్‌ నిరూపించుకున్నవాళ్లే! కానీ ఓసారి పంకజ్‌ త్రిపాఠి.. మనోజ్‌ చెప్పులు దొంగిలించాడట. ఆ తర్వాత కొంతకాలానికి తనే స్వయంగా వెళ్లి వాటిని దొంగిలించింది తానేనని నిజం అంగీకరించాడట. తాజాగా ఈ విషయాన్ని మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

'ఓసారి హోటల్‌కు వెళ్లినప్పుడు నా చెప్పులు పోయాయి. నేనే ఎక్కడైనా విడిచిపెట్టి మర్చిపోయాననుకున్నా. కానీ గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో పంకజ్‌ నా దగ్గరకు వచ్చి ఆ విషయం గుర్తుచేశాడు. పాట్నా హోటల్‌లో మీ చెప్పులు కనిపించకుండా పోయాయి కదా, వాటిని తనే తీసుకెళ్లినట్లు చెప్పాడు' అని మాట్లాడుతుండగా మధ్యలో పంకజ్‌ అందుకుని ఆరోజు ఏం జరిగిందో వెల్లడించాడు.

'ఆ రోజుల్లో నేను కిచెన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాను. నేను పని చేస్తున్న హోటల్‌కు మనోజ్‌ బాజ్‌పాయ్‌ వచ్చాడని తెలిసింది. దీంతో అతడు ఏ చిన్న అవసరం కోసం పిలిచినా నాకే చెప్పండి, నేనే వెళ్తాను అని మిగతా సిబ్బందికి చెప్పాను. అలా తన గదికి వెళ్లాను, కలిసి మాట్లాడాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. ఆయన హోటల్‌ నుంచి వెళ్లిపోయేటప్పుడు చెప్పులు మర్చిపోయాడని తెలిసింది. వెంటనే నేను వాటిని ఆయనకు అప్పజెప్పకుండా నాకివ్వమని చెప్పాను' అని చెప్పుకొచ్చాడు పంకజ్‌ త్రిపాఠి.

మరిన్ని వార్తలు