ముప్పైకి పైగా భయపడే సీన్లు ఉన్నాయి

3 Dec, 2023 01:49 IST|Sakshi

‘‘నా 30 ఏళ్ల వయసులోనే ఐటీ కంపెనీలను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేశాను. దాంతో సినిమా తీయడం సులభం అనుకున్నాను. కానీ వంద కాదు.. వెయ్యి కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత సులభం కాదని తెలుసుకున్నాను. వందల మంది కలిసి పని చేస్తూ, అన్నీ కలిసి వస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’’ అన్నారు యశ్వంత్‌ దగ్గుమాటి.

శ్రీరామ్, ఖుషీ జంటగా ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించిన హారర్‌ ఫిల్మ్‌ ‘పిండం’. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా యశ్వంత్‌ దగ్గుమాటి మాట్లాడుతూ– ‘‘నాకు యూఎస్‌లో ఐటీ కంపెనీలున్నాయి. సాయికిరణ్‌కు సినిమాలపై ఆసక్తి. ఓ సినిమా చేద్దామని ఇండియా వచ్చాం. సిద్ధు జొన్నలగడ్డతో మేం చేయాల్సిన ‘డల్లాస్‌ దేశీ దొంగలు’ సినిమా లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో కథ అనుకున్నాం. అది కూడా కుదర్లేదు. ఆ నెక్ట్స్‌ ‘పిండం’ కథను రెడీ చేశారు సాయికిరణ్‌.

ఓ సందర్భంలో సాయికిరణ్‌ వాళ్ల నాన్నమ్మ ఓ భవంతిని చూపించి, ఓ కథ చె΄్పారట. ఆ కథకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘పిండం’ కథ రాశారు. ఈ సినిమాలో ముప్పైకి పైగా భయపడే సన్నివేశాలు ఉన్నాయి. 1930, 1990, 2023.. ఇలా మూడు కాలమానాల్లో స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇక మా సంస్థలో మొదలైన తొలి చిత్రం ‘డల్లాస్‌లో దేశీ దొంగలు’ ఉంటుంది. మరికొన్ని కథలు ఉన్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు