కొత్త స్టెప్‌ వేశారు

21 Nov, 2020 02:09 IST|Sakshi

ఇండియన్‌ ఇండస్ట్రీలో స్టార్స్‌ అందరితో ప్రభుదేవా స్టెప్స్‌ వేయిస్తుంటారు. అయితే ఆయన లైఫ్‌లో ఓ కొత్త స్టెప్‌ వేశారని తెలిసింది. రెండోసారి పెళ్లి చేసుకున్నారట. కొన్ని రోజులుగా ప్రభుదేవా తన మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే అది నిజం కాదట. ముంబైలోని ఓ ఫిజియోథెరపిస్ట్‌ను వివాహం చేసుకున్నారట ప్రభుదేవా. సెప్టెంబర్‌లో వీరి వివాహం చాలా చిన్న వేడుకగా జరిగిందట.

ఈ ఇద్దరి పరిచయం కూడా విచిత్రంగా జరిగిందని టాక్‌. వెన్ను నొప్పి సమస్యలో భాగంగా ఈ ఫిజియోథెరపిస్ట్‌ను కలిశారట ప్రభుదేవా. అక్కడి నుంచి వీళ్ల మధ్య స్నేహం ఏర్పడి, ప్రేమగా మారి, పెళ్లి వరకూ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ చెన్నైలో ఉంటున్నారని సమాచారం. గతంలో రమలత్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రభుదేవా. రమలత్‌ ప్రభుదేవా జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడటం, బ్రేకప్‌ విషయం తెలిసిందే. మరి.. ఫిజియోథెరపిస్ట్, ప్రభుదేవా సెవన్‌ స్టెప్స్‌ వేసారా? నిజమేంటో?

మరిన్ని వార్తలు