Pakka Commercial: ఆ హీరోలకు పీఆర్వోగా, తర్వాత నిర్మాతగా..

7 Jul, 2021 07:22 IST|Sakshi
నిర్మాత ఎస్‌కేఎన్‌

‘‘సినిమా అనేది మన రోజువారీ జీవితంలో ఓ భాగం. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరిగింది. ప్రేక్షకుల్లో కాస్త భయం తగ్గింది. థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయితే ప్రేక్షకులు మునుపటిలా వస్తారనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. ‘ఈ రోజుల్లో, టాక్సీవాలా’ నిర్మాత ఎస్‌కేఎన్‌ బర్త్‌ డే నేడు (జూలై 7). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జర్నలిస్టుగా, ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్‌ హీరోలకు పీఆర్వోగా చేశాను. మారుతి దర్శకుడిగా పరిచయమైన ‘ఈ రోజుల్లో..’తో నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది.

ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. విజయ్‌ దేవరకొండతో ‘టాక్సీవాలా’ తీశాను. నేను, మారుతి, బన్నీ వాసు, యూవీ వంశీ.. సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి మిత్రులం. ‘ఈ రోజుల్లో..’ తో నేను, మారుతి, ‘100 పర్సెంట్‌ లవ్‌’తో వాసు, ‘మిర్చి’తో వంశీ.. ఇలా మేం హిట్‌ సినిమాలతోనే ఇండస్ట్రీకి వచ్చాం. మాకు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ ఉండవు. పైగా అల్లు అరవింద్‌గారి సలహాలు, సూచనలతో ముందుకెళుతున్నాం. సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రీ ప్లేస్‌ చేయలేదు.

కరోనా వల్ల కొందరు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు వెళ్లడం తప్పు కాదు. అయితే థియేటర్స్‌ వ్యవస్థ లేకపోతే స్టార్‌డమ్‌ తగ్గిపోతుంది. థియేటర్స్‌ మనుగడ బాగుంటే థియేటర్స్‌కు, ఇండస్ట్రీకి కూడా మేలు. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’కి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. మారుతి అండ్‌ టీమ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఓ సినిమాను నేను, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాం. రచయిత, దర్శక–నిర్మాత సాయి రాజేశ్‌తో మూడు సినిమాలు చేయనున్నాను. దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు, రాహుల్‌ సంకృత్యాన్, వీఐ ఆనంద్, కరుణ్‌ కుమార్‌లతోనూ సినిమాలు ఉన్నాయి. మారుతి, నేను ‘మాస్‌ మూవీ మేకర్స్‌’ బ్యానర్‌ ద్వారా వెబ్‌ కంటెంట్‌ను వ్యూయర్స్‌ ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు.

చదవండి: ‘పక్కా కమర్షియల్‌’..పోస్టర్‌ రిలీజ్‌ 

మరిన్ని వార్తలు