హైదరాబాద్‌ టు వైజాగ్‌ వయా కర్నూలు

12 Feb, 2023 02:10 IST|Sakshi

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో పాటలు విజువల్‌ ట్రీట్‌లా ఉంటాయి. భారీ ఖర్చుతో పాటలు చిత్రీకరించడం శంకర్‌ స్టయిల్‌. పైగా ఒకే పాటను వివిధ రకాల లొకేషన్స్‌లో తీస్తుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ అలానే జరుగుతోంది. ఈ చిత్రం కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో న్యూజిల్యాండ్‌లో ఓ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు మరో పాట చిత్రీకరణలో ఉన్నారు.

ఈ పాటను తెలుగు రాష్ట్రాల్లోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌ లొకేషన్‌లో ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత కర్నూలులోని కొండారెడ్డి బురుజు లొకేషన్‌లో, ఆ నెక్ట్స్‌ వైజాగ్‌లోని జగదాంబ  సెంటర్‌లో చిత్రీకరణను ప్లాన్‌ చేశాను. కొండారెడ్డి బురుజు దగ్గర  కొంత భాగం చిత్రీకరించి, వైజాగ్‌ షిఫ్ట్‌ అయింది యూనిట్‌.  ఈ పాటను దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారని టాక్‌. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్‌.
 

మరిన్ని వార్తలు