రానా చేతుల మీదుగా ‘వరుడు కావలెను’ ట్రైలర్‌

22 Oct, 2021 08:07 IST|Sakshi

‘‘వరుడు కావలెను’ టైటిల్‌ చూశాక హీరో ఎవరో నాకు చెప్పకపోయినా నాగశౌర్య అని ఊహించేవాణ్ణి. రాముడు మంచి బాలుడు అంటారు కదా.. తనను చూస్తే అలా అనిపిస్తుంటుంది. ఈ టైటిల్‌ తనకు కరెక్ట్‌గా సరిపోయింది’’ అని హీరో రానా అన్నారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రానా విడుదల చేశాడు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారి గురించి శేఖర్‌ కమ్ములగారి శిష్యులు చెబుతుంటే విన్నాను. ఈ చిత్రంతో ఆమె మంచి హిట్‌ అందుకోవాలి. మంచి టీమ్‌ పనిచేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. నాగశర్య మాట్లాడుతూ..‘‘వరుడు కావలెను’ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. హీరోని బట్టి కాదు.. కథను బట్టి బడ్జెట్‌ పెట్టేవాళ్లను మూవీ మేకర్స్‌ అంటారు. తెలుగు ఇండస్ట్రీలోని మేకర్స్‌లో నాగవంశీ, చినబాబుగార్లు కూడా ఒకరు. ఈ చిత్రంలో నేను ఇంత అందంగా ఉండటానికి కారణం కెమెరామ్యాన్‌ వంశీ పచ్చిపులుసుగారే.

ఈ సినిమాలో నన్ను నేను చూసుకుని లవ్‌లో పడిపోయా. 2018 ఫిబ్రవరి 2న ‘ఛలో’ సినిమా విడుదలైంది. ఆ రోజు సాయంత్రం సక్సెస్‌మీట్‌లో లక్ష్మీ సౌజన్య అక్కను కలిశా. తను ఆరోజు చెప్పిన లైన్‌ నాకు బాగా నచ్చి ఈ సినిమా చేశాను. రీతూ వర్మకీ, నాకు ఏదో గొడవ అయిందనే వార్తల్లో నిజం లేదు. తను షూటింగ్‌లో ఉండి రాలేదు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సినిమా చూసి మమ్మల్ని బతికించండి.. మీరు ఆనందంగా ఉండండి’’  అన్నారు.  ‘‘నాకు అవకాశం ఇచ్చిన వంశీ, చినబాబులకు థ్యాంక్స్‌’’ అన్నారు లక్ష్మీ సౌజన్య.

మరిన్ని వార్తలు