సలార్‌ మొదటి టికెట్‌ కొన్న స్టార్‌ డైరెక్టర్‌.. ధర ఎంతో తెలుసా..?

16 Dec, 2023 10:57 IST|Sakshi

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం సలార్‌.. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్‌ టీజర్‌, ట్రైలర్‌లోనూ ప్రభాస్‌ ఎలివేషన్స్‌ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్‌ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్టార్ట్‌ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్‌ కాలేదు.  సలార్‌ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టికెట్‌ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్‌ కోరిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. సింగిల్‌ థియేటర్‌ నుంచి మల్టీఫ్లెక్స్‌ వరకు టికెట్‌ ధరపై రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని వారు కోరినట్లు సమాచారం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆన్‌లైన్‌లోకి టికెట్లు అందుబాటులోకి వస్తాయిని తెలుస్తోంది.

సలార్‌ టికెట్‌ కోసం రూ.10 వేలు
సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్‌లలో సలార్‌ టీమ్‌ కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీమ్‌.. ఇందులో భాగంగా సలార్‌ మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారు. డార్లింగ్‌ సినిమా టికెట్‌ కోసం రూ. 10 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు సంబంధించి ఉదయం 7గంటల ఆటకు టికెట్‌ను ఆయన కొన్నారని మైత్రి మేకర్స్‌ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ఇండియా బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమా మొదటి టికెట్‌ను రాజమౌళి కొన్నారని క్యాప్షన్‌ ఇచ్చింది.  త్వరలో జక్కన్నతో ప్రభాస్‌,ప్రశాంత్‌ నీల్‌ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

>
మరిన్ని వార్తలు