Prithviraj Sukumaran: ప్రభాస్‌ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

16 Dec, 2023 12:25 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌  ప్రభాస్‌  హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్‌ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'సలార్‌' తెరకెక్కింది. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ స్టార్‌ యాక్టర్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌, సలార్‌ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు.

'వరదరాజ మన్నార్ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అది ఫలించిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇన్‌పుట్ చాలా బలంగా ఉంది. అతను మొత్తం షాట్‌ను ఒక్క క్షణంలో మార్చగల దర్శకుడు.  నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్‌ చూడలేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. సలార్‌తో నా కల నెరవేరింది.' అని ఆయన అన్నాడు.

ప్రభాస్‌ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది!
సలార్‌లో ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. 'ప్రభాస్‌ని ఇన్‌స్టంట్‌గా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రభాస్‌తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఎవరైనా ఇష్టపడుతారు. నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. కానీ నేను ప్రతిరోజూ మాట్లేడే వారిలో ప్రభాస్‌ ఉన్నారు.. నేను ఎల్లప్పుడూ మెసేజ్ చేసే స్నేహితుల్లో అతను ఒకరు. ఇతరుల సంతోషంలో కనిపించే ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి ప్రభాస్. సెట్‌లో ప్రతి ఒక్కరి మంచి కోసం మాత్రమే ప్రభాస్‌ చూస్తారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు. సెట్స్‌లో అందరి కోసం మంచి భోజనం తెప్పిస్తారు. ఇలా ఎప్పుడూ ఇతరుల గురించే ప్రభాస్‌ ఆలోచిస్తారు. అందుకే ఆయన అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌  అని పిలుస్తారని ఈ షూటింగ్‌ సమయంలో నాకు అర్థమైంది' అని చెప్పారు.

ఆపై సలార్‌ సినిమా గురించి పృథ్వీరాజ్‌ చెబుతూ...  'సలార్‌ సినిమా కథను నేను ఎప్పుడూ వినలేదు.. కనీసం స్క్రిప్ట్ కూడా చదవలేదు. ఈ ప్రాజెక్ట్‌లోకి నాకు అవకాశం దక్కడం చాలా సంతోషం. ఇందులో నా పాత్ర సెకండరీ కావచ్చు అయినా కథలో నా ప్రత్యేకత ఏంటి అనేది చూస్తారు. యావరేజ్ సినిమాలో గొప్ప పాత్ర చేయడం కంటే మంచి సినిమాలో ఇలాంటి  పాత్రను పోషించడం చాలా గొప్ప.  టీజర్‌, ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. ఇందులో యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న స్టోరీ ఇది.' అని పృథ్వీరాజ్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు