Santhanam: కిక్‌ ఇచ్చేందుకు సంతానం రెడీ.. బ్రహ్మానందం, కోవై సరళతో పాటు..

28 Aug, 2023 10:17 IST|Sakshi

'డీడీ రిటర్న్స్‌' సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు నటుడు సంతానం. తాజాగా ఇతడు ప్రేక్షకులకు మంచి కిక్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈయన తాజాగా నటించిన చిత్రం కిక్‌. ఫార్చూన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నవీన్‌ రాజ్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. తాన్యా నైతిక హీరోయిన్‌గా నటించింది. నటి రాగిణి త్రివేది, కోవై సరళ, తంబి రామయ్య, సెంథిల్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌, బ్రహ్మానందం, సాధు కోకిల, ముత్తుకాళై, మనోబాల, కింగ్‌ కాంగ్‌, క్రేన్‌ మనోహర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అర్జున్‌ జాన్య సంగీతం, సుధాకర్‌ రాజ్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర విడుదల హక్కులను వైఎంఆర్‌ క్రియేషన్స్‌ సంస్థ పొందింది. కాగా ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చైన్నెలోని ఓ స్టార్‌ హోటల్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ.. ఒకరోజు ఈ చిత్ర నిర్మాత నవీన్‌ రాజ్‌, దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌ తనను వెతుక్కుంటూ పాండిచ్చేరి వరకూ వచ్చి కథ వినిపించారన్నారు.

కథతో పాటు, వారి తమిళ భాషా నచ్చిందన్నారు. దీంతో చిత్ర షూటింగ్‌ను ఓకే షెడ్యూల్‌లో చైన్నెలో ప్రారంభించి న్యూయార్క్‌లో పూర్తి చేసినట్లు చెప్పారు. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా కిక్‌ ఉంటుందన్నారు. ఇది అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఇగో అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సినిమా అని  చెప్పారు. దీన్ని డీడీ రిటర్న్స్‌ చిత్రంతో పోల్చరాదని, ఇది మరో తరహాలో ఉంటుందన్నారు. దీన్ని సంతానం చిత్రం అనడం కంటే దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌ చిత్రం అనే చెప్పాలన్నారు.

చదవండి: శేఖర్‌ మాస్టర్‌ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: ‍శ్రీలీల

మరిన్ని వార్తలు