ఇంటికి చేరుకున్న హీరోయిన్‌.. ఆత్మీయ స్వాగతం

15 Oct, 2020 16:08 IST|Sakshi

మహమ్మారి కరోనా బారిన పడి కోలుకున్న హీరోయిన్‌ తమన్నా భాటియా ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లిన ఆమె బుధవారం తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ ఆనంద క్షణాలకు సంబంధించిన సంబంధించిన వీడియోను మిల్కీ బ్యూటీ తన అభిమానులతో పంచుకున్నారు. తమన్నా ఇంటికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులు రజని, సంతోష్‌ భాటియా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. ఇక తమన్నా పెంపుడు కుక్క పెబెల్స్‌ సైతం ఆమెను చూడగానే సంతోషంతో గంతులు వేసింది. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా : తమన్నా)

ఇక క్వారంటైన్‌ అనుభవం గురించి తమన్నా మాట్లాడుతూ.. ‘‘క్రేజీగా అనిపించింది. ఇదంతా ముగిసిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జీవితం నేను జీవించవచ్చు. త్వరలోనే అన్ని విషయాలను మీతో పంచుకుంటాను’’అని చెప్పుకొచ్చారు. ఇకపై మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటానని, కరోనా కారణంగా కోల్పోయిన శక్తినంతటినీ తిరిగి పొందేందుకు, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటానని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా షూట్‌కు వెళ్తానని చెప్పారు. 

ఇక మూడు నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోపై తమన్నా బెస్ట్‌ఫ్రెండ్‌, నటి శృతి హాసన్‌ స్పందించారు. ఇదంతా చూస్తుంటే తనకెంతో సంతోషం కలుగుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆగష్టులో తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. ఈనెల మొదటి వారంలో తమన్నాకు సైతం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. షూట్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో అక్కడే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని రోజులపాటు స్వీయనిర్భందంలో ఉన్న ఆమె, బుధవారం ఇంటికి వెళ్లారు. నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న అంధాధున్‌ సినిమా రీమేక్‌లో తమన్నా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు