Rasi Thangadurai: సినీ రచయిత కన్నుమూత.. పాఠశాల దశలోనే చదువు ఆగిపోయినా..

14 Nov, 2023 10:37 IST|Sakshi

తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మాటల రచయిత రాశితంగదురై (53) సోమవారం ఉదయం కన్ను మూశారు. వివరాలు.. ఆండిపట్టి సమీపంలోని కధిర్‌ నరసింగపురానికి చెందిన రాశితంగదురై చదువు పాఠశాల దశలోనే ఆగి పోయింది. అయితే కథలు, కవితలు రాయడంపై మక్కువ చూపిస్తూ రెండు వందలకు పైగా కథలు రాశారు. అలా సినీ రంగానికి మాటల రచయితగా పరిచయమయ్యారు.

నటుడు విజయ్‌ సేతుపతి నిర్మించిన మేర్కు తొడర్చిమలై చిత్రానికి మాటలు రాయడంతో పాటు చిన్న పాత్రను సైతం పోషించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. తరువాత తేన్‌ అనే చిత్రానికి సంభాషణలు అందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు కేవీ, తాక్కల్, ఆధారం తదితర చిత్రాలకు రాశి తంగదురై మాటలను రాశారు. మరో నాలుగైదు చిత్రాలకు కమిట్‌ అయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య మురుగేశ్వరి, కుమారులు రాశి ప్రియన్, సుఖదేవ్‌ దిలీపన్‌ ఉన్నారు. రాశి తంగదురై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: ఆ సినిమాలో ఛాన్స్‌ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్‌ ఏం చేశాడంటే: కస్తూరి

మరిన్ని వార్తలు