Chandra Mohan: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో..

11 Nov, 2023 13:04 IST|Sakshi

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగానే కాకుండా, అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆయన నేడు అందరికీ దూరంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి గల కారణాలను చంద్రమోహన్‌ బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ తాజాగా మీడియాకు వెల్లడించారు.

కిడ్నీ సమస్య
శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. 'చంద్రమోహన్‌గారు నాకు స్వయానా మేనమామ. ఆయన నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చనిపోయారని నిర్దారించారు. ఆయన కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాము' అని తెలిపారు.

ఆరోగ్యం సహకరించికపోవడంతో రిటైర్‌మెంట్‌
కాగా చంద్రమోహన్‌ కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారు. తాను ఉక్కు మనిషిని, తనకేం జరుగుతుందిలే అనుకున్నారు. ఆ నిర్లక్ష్యమే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. 2006లో రాఖీ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్‌ సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు.

చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు!
 చంద్రమోహన్‌, కె విశ్వనాథ్, ఎస్పీ బాలు రిలేషన్ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు