ములుగు: రాహుల్ గాంధీపై అనర్హత వేటు కక్ష సాధింపు చర్య అని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏఐసీసీ మహిళా ప్రధానకార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రశ్నించే గొంతుకను బీజేపీ ప్రభుత్వం నొక్కిపట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్ పాల్గొన్నారు.