గాయపడిన గీతకార్మికుడు మృతి

14 Mar, 2023 05:58 IST|Sakshi
అంజయ్య మృతదేహం

కట్టంగూర్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీతకార్మికుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దుగినవెల్లి గ్రామ పంచాయితీ పరిధి తూర్పుబాయిగూడెం గ్రామానికి చెందిన మండల అంజయ్య(65) రోజువారీ మాదిరిగానే ఆదివారం సాయంత్రం తాటిచెట్టును ఎక్కేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మాణిక్కాలమ్మగూడెం ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాదు వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రున్ని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపటంతో హైదరాబాదుకు తరలిస్తుండగా సోమవారం మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

గుండెపోటుతో

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : గుండెపోటుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతిచెందాడు. మండల పరిధిలోని కోటపహాడ్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎల్లయ్య (45) సోమవారం ఉదయం కూలీలను ఉపాధి పనులకు తీసుకువెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు