నల్లగొండ: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,374 మంది దివ్యాంగులు, వృద్ధులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోగా సోమవారం తొలి రోజు 942 మంది దివ్యాంగులు, వృద్ధులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది నకిరేకల్ మినహా ఐదు నియోజకవర్గాల్లో దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకే పోస్టల్ బ్యాలెట్లు తీసుకెళ్లి ఓట్లు వేయించుకున్నారు. నల్లగొండ నియోజకవర్గం పరిధిలో 228, నాగార్జున సాగర్లో 209, మునుగోడులో 194, దేవరకొండలో 166, మిర్యాలగూడ నియోజకవ్గంలో 145 మందితో కలిపి మొత్తం 942 మంది పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన ఓటు వేశారు. నల్లగొండలోని పెద్దబండ, కనగల్ మండలం లింగోటంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ కర్ణన్తో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు అవినాష్ చంపావత్ పరిశీలించారు. తొలిసారి ఇంటి వద్దే ఓటేయడం చాలా ఆనందంగా ఉందని పలువురు వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.
ఫ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్, ఎన్నికల పరిశీలకుడు