మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్‌ పోటాపోటీ 

18 Dec, 2022 09:06 IST|Sakshi

‘తీయగా’ తినేస్తోంది

సాక్షి, విశాఖపట్నం: మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. జనాభా మాదిరిగానే మధుమేహ రోగుల్లోనూ చైనా, భారత్‌ పోటీ పడుతున్నాయి. చైనా 141 మిలియన్ల మంది డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ 77 మిలియన్ల మధుమేహులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 2045 సంవత్సరం నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీని బారినపడే వారిలో మహిళల (40 శాతం) కంటే పురుషులే (60 శాతం) అధికంగా ఉంటున్నారు.

2020లో దేశంలో 7 లక్షల మంది డయాబెటిస్‌తో చనిపోయారు. ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం దేశంలోకెల్లా కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 13.6 శాతంతో ఛండీగఢ్, తమిళనాడు, 8.9 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 9 మందికి మధుమేహం ఉన్నట్టు లెక్క. మధుమేహ బాధితుల సంఖ్య పెరగడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయనే విషయాన్ని ఇదివరకే గుర్తించారు. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్స్‌ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్‌ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది.

ఇదీ చదవండి: చైనాలో కోవిడ్‌ విజృంభణ.. ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా ప్రాణాంతకం కాదు! 

మరిన్ని వార్తలు