వాయు కాలుష్యంతో క్యాన్సర్‌? ‘ఎయిమ్స్‌’ నిపుణులు ఏమంటున్నారు?

6 Nov, 2023 12:45 IST|Sakshi

దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్రమైన’ విభాగంలోనే కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ నేపధ్యంలో వైద్య నిపుణులు ఆరోగ్యంపై వాయు కాలుష్యానికి సంబంధించిన ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలియజేశారు. డాక్టర్ పీయూష్ రంజన్ (అడిషనల్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎయిమ్స్) మీడియాతో మాట్లాడుతూ వాయు కాలుష్యం- వివిధ రకాల క్యాన్సర్‌ల మధ్యగల సంబంధానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులతో వాయు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తెలిపారు. 

వాయు కాలుష్యం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశాలున్నాయని, ఇది అన్ని వయసులవారిలో సంభవించవచ్చన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక  ఆదివారం వరుసగా నాల్గవ రోజు కూడా ‘తీవ్రమైన’ విభాగంలోనే ఉంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!

మరిన్ని వార్తలు