సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం

13 Sep, 2023 19:01 IST|Sakshi

ఢిల్లీ: విధినిర్వహణలో ప్రాణాలను అర్పించింది ఓ సైనిక జాగిలం. సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. 

'ఆపరేషన్‌ సుజలిగల'లో భాగంగా జమ్మూ రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. వారికి తోడుగా 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన ఆరేళ్ల కెంట్  అనే కుక్కను తీసుకువెళ్లారు. సైనికులందరూ కెంట్‌ను అనుసరిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టిన కెంట్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది.  ఈ క్రమంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. 

కాల్పుల్లో ఉగ్రవాదులు ఓ సైనికున్ని చుట్టుముట్టారు. అతన్ని రక్షించడం కోసం కెంట్ ఉగ్రవాదులకు ఎదురునిలిచింది. ఈ క్రమంలో తూటాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది, ఒక ఆర్మీ జవాన్ మరణించారని వెల్లడించారు. 

ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..


 

మరిన్ని వార్తలు