కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!

29 Oct, 2023 12:01 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రేయర్‌ మీట్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇక, పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం‌ ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.

ఇక, పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇది కూడా చదవండి: డీకే శివకుమార్‌ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..!

మరిన్ని వార్తలు