కేబుల్‌ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా?

1 Nov, 2022 20:29 IST|Sakshi

బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయి 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత కేబుల్‌ బ్రిడ్జిల సామర్థ్యం, నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. మోర్బీ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. మోర్బీ ఘటన జరిగిన మరుసటి రోజునే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అత్యుత్సాహంతో కేబుల్‌ బ్రిడ్జిపైకి ఏకంగా కారునే తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

యెల్లపురా నగరంలోని నదిపై ఉన్న తీగల వంతెనపైకి ఓ వ్యక్తి కారును తీసుకొచ్చాడు. అయితే, ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో స్థానికులు అతడికి సాయం చేసి కారును వెనక్కి తీసుకెళ్లి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, నడక కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఈ అంశంపై అధికారులకు సమాచారం అందించి అలర్ట్‌ చేశారు. అయితే, బ్రిడ్జిపై బైక్‌లు వెళ్లటాన్ని చూసి.. కారు సైతం వెళ్తుందని భావించినట్లు డ్రైవర్‌ తెలిపాడు. తాను స్థానికుడిని కాదని, ఫోర్‌వీలర్స్‌కు బ్రిడ్జి సరికాదని తెలియదని చెప్పాడు.

ఇదీ చదవండి: మోర్బీలో ప్రధాని మోదీ.. కేబుల్‌ బ్రిడ్జి ప్రమాద బాధితులకు పరామర్శ

మరిన్ని వార్తలు