చైనా దూకుడుపై నిఘా వర్గాల నివేదిక

20 Aug, 2020 17:41 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సరిహద్దుల్లో సేనల కదలికలపై డ్రాగన్‌ ఆరా

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ దొంగదెబ్బ తీసినా దీటుగా బదులిచ్చిన భారత్‌ పాటవాన్ని తక్కువగా అంచనా వేయరాదని చైనా భావిస్తోంది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సెంట్రల్‌ సెక్టార్‌ కదలికలపై డ్రాగన్‌ కన్సేసిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. గల్వాన్‌ లోయలో జూన్‌ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం భారత్‌-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెచ్చుమీరిన సంగతి తెలిసిందే.  ఉత్తరాఖండ్‌ చమోలి జిల్లాలోని భారత్‌ సరిహద్దుల్లో బారహోటి ప్రాంతం వరకూ తన నిఘా వ్యవస్ధను చైనా విస్తరించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

భారత్‌-చైనాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా డ్రాగన్‌ నియంత్రణ రేఖ పొడవునా నిఘా పరికరాలను ఆధునీకరించిందని తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి 180 డిగ్రీల్లో తిరుగాడేలా చైనా రెండు కెమెరాలను అమర్చిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలో పలు స్తంభాలను చైనా ఏర్పాటు చేసిందని, ఇక్కడే భారీ సోలార్‌ ప్యానెల్‌ను, విండ్‌ మిల్‌ను నిర్మించిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో చిన్న పక్కా ఇంటిని నిర్మించి అందులో నిర్మాణ సామాగ్రిని, నిఘా పరికరాలను చైనా ఉంచిందని పేర్కొంది. బారహోతి ప్రాంతంలో భారత సేనల కదలికలను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పసిగట్టేలా కెమెరాలను అమర్చిందని వెల్లడించారు. చదవండి : పాక్‌ కుయుక్తులు : కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు

మరిన్ని వార్తలు