కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు

4 Nov, 2023 05:42 IST|Sakshi

అహ్మదాబాద్‌: కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్‌ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్‌ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్‌ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్‌ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం.

ఇక పోలీస్‌ కమిషనర్, కలెక్టర్‌ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్‌ అగర్వాల్‌ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్‌ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది.

మరిన్ని వార్తలు