భారత్‌లో కరోనా: 17 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల

23 Dec, 2023 12:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా.. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,420కి చేరింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.

అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక..రాజస్థాన్‌లో ఒకరి చొప్పున వైరస్‌ బారినపడి మరణించారు. 


 తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్‌ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. 

జేఎన్‌.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్‌.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్‌ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి.

ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్‌.. అదే జరిగితే తట్టుకోగలమా?

>
మరిన్ని వార్తలు