కానరాని కొడుకులు.. అమ్మలే.. ఆ నలుగురై

4 Jan, 2022 15:02 IST|Sakshi
 తల్లి అంతిమ యాత్ర నిర్వహిస్తున్న కూతుళ్లు 

తల్లి అంతిమయాత్రకు హాజరుకాని కొడుకులు

దహన సంస్కారాలు జరిపిన కూతుళ్లు

పూరీ మంగళా ఘాట్‌లో ఘటన 

సాక్షి, భువనేశ్వర్‌/పూరీ: కాటి వరకు భుజాన మోసుకుని వెళ్లాల్సిన కన్న కొడుకులు కానరాలేదు. తోడబుట్టిన అన్నదమ్ములు తల్లి అంతిమయాత్రకు రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ఓ ముందడుగు వేశారు. సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకున్నారు. 4 కిలోమీటర్ల దూరం మోసి, అమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. పూరీ పట్టణంలో ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మంగళా ఘాట్‌ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది. ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక్కరూ ఆమెను కడసారి చూసేందుకు రాలేదు.

దీంతో ఈమె నలుగురు కుమార్తెలు కన్న తల్లి రుణం తీర్చుకున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మంగళాఘాట్‌ నుంచి స్వర్గ ద్వార్‌ వరకు తల్లి మృతదేహాన్ని మోసుకుని వెళ్లి, దహన సంస్కారాలు చేయించారు. ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా స్థానికులు భావిస్తారు. కని, పెంచిన తల్లికి స్వర్గ లోకం ప్రాప్తించాలని ఆ నలుగురు కుమార్తెలు తమ తల్లికి కడపటి వీడ్కోలు పలికారు. 

    

మరిన్ని వార్తలు