ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ

27 Jul, 2022 07:05 IST|Sakshi

కోజికోడ్‌: కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా అదృష్టం లాటరీ రూపంలో వచ్చి కాపాడింది. తన సొంతింటిని మరికొద్ది గంటల్లో విక్రయించే సమయంలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్‌ తగిలింది. కోజికోడ్‌లోని మంజేశ్వర్‌కు చెందిన మహ్మద్‌ బవ(50) వృత్తిరీత్యా పెయింటర్‌. ఇతడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. సుమారు 8 నెలల క్రితం 2వేల అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు. అయితే, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతోపాటు కొడుకును ఖతార్‌ పంపేందుకు చేసిన రూ.50లక్షల అప్పులు మిగిలాయి. దీంతో, కట్టుకున్న ఇంటిని రూ.40 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు.

అయితే, ఇతడికి లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నాలుగు టికెట్లు కొన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్వాహకులు డ్రా తీయగా మహ్మద్‌కు జాక్‌పాట్‌ తగిలింది. కొద్ది గంటల్లో అడ్వాన్స్‌ కూడా తీసుకోవాల్సి ఉన్న సమయంలో ఇది జరిగింది. దీంతో మహ్మద్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ మొత్తంలో పన్నులు పోగా చేతికి రూ.63 లక్షలు అందనుంది. దీంతో, కలల ఇంటిని అమ్మే అవసరం అతడికి తప్పింది.

ఇదీ చదవండి: ఒక్క రూపాయి డాక్టర్‌ సుషోవన్‌ ఇకలేరు

మరిన్ని వార్తలు