Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు ఈడీ నోటీసులు

20 Dec, 2023 17:56 IST|Sakshi

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో తేజస్వీ డిసెంబర్‌ 22న, లాలూ డిసెంబర్‌ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

కాగా ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ జూలైలో రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్‌లో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ, అతని కుటుంబ సభ్యులపై ఇది రెండవ ఛార్జిషీట్. అంతేగాక తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొన్న కేసులో మొదటి ఛార్జిషీట్.

ఇక  2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్‌ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు.  ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా తనకు అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబాం తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు మోపాయి.

ఈ క్రమంలో సీబీఐ గత ఏడాది మేలో లాలూ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ, భార్య రబ్రీ దేవి, అతని కుమారుడు తేజస్వి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్, లబ్ధిదారులతో సహా 17 మంది వ్యక్తుల పేర్లను నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా బెయిల్‌ మంజూరైన రెండు నెలల తర్వాత లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం.
చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్‌ హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

>
మరిన్ని వార్తలు