Gujarat Assembly Election Results 2022: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌.. ప్రమాణం ఎప్పుడంటే?

8 Dec, 2022 19:38 IST|Sakshi

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

07:00PM
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ 156 చోట్ల విజయం కేతనం ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది.  మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం రికార్డును బీజేపీ సమం చేసింది. కాగా 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాల పాటు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పశ్చిమ బెంగాల్‌ను పాలించింది.  

06:30PM
గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ విజయం సాధించారు. వడ్గమ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. అనంతరం తనకు విజయాన్ని అందించినందుకు వడ్గాం ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది సమాజంలోని పేద, అట్టడుగు వర్గాలను మరింత ముందుకు తీసుకొచ్చే బాధ్యతను కూడా తనకు అందిస్తుందని మేవానీ ట్వీట్ చేశారు.

05:15PM
గుజరాత్‌లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి  భావోద్వేగాని లోనైనట్లు తెలిపారు. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.. ఇదే జోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. గుజరాత్‌ ప్రజలకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ఈ విజయం కోసం కష్టపడి పనిచేసిస గుజరాత్‌ బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఛాంపియన్స్‌. పార్టీకి నిజమైన బలం అయిన కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.’ అని ట్వీట్‌ చేశారు.

04:15PM
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల కోత  వెనుక ఆప్‌, అసదుద్దీన్ ఒవైసీ ఓ కారణమన్నది నిజమని గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ జే ఠాకూర్‌ పేర్కొన్నారు. తమ లోటుపాట్లను విశ్లేషించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే..

03:45PM
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి పరాజయం పొందారు. ఖంభాలియా నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హర్దాస్‌భాయ్‌ బేరాపై 18వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

03:15PM
గుజరాత్‌లో కాంగ్రెస్ ఓట్లకు చీల్చేందుకు బీజేపీ ఆప్‌కి నిధులు సమకూర్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ భారీగా డబ్బు వెదజల్లిందని విమర్శించారు. ఆప్‌ పోటీలోకి రావడంతో తాము వెనకబడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 10 శాతం ఓట్లు రావడంతో కాంగ్రెస్‌ ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.

మోర్బి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతీయ విజయం సాధించారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన జయంతిలాల్ పటేల్‌పై 61,5000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

03:00PM
గుజరాత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రదర్శించారని రాఫ్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు దేశ వ్యతిరేక శక్తులను తిరస్కరించారని అన్నారు. ప్రజల అభిష్టాన్ని స్వీకరిస్తున్నామని, బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాసేవకే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు..

02:30PM
గుజరాత్‌లో బీజేపీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. బూటకపు వాగ్దానాలు చేసిన వారిని ప్రజలు తిరస్కరించారని.. ప్రధాని మోదీ అభివృద్ధి, పాలనపై నమ్మకంతో బీజేపీకి అపూర్వమైన విజయాన్ని అందించారని తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలూ బీజేపీ వెంటే ఉన్నాయనడానికి ఈ భారీ విజయం సాక్ష్యంగా నిలిచిందన్నారు.

01:53PM
► గుజరాత్‌ జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు.  61 వేలకుపైగా భారీ మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. గెలుపుపై ఆమె స్పందిస్తూ.. ఇది అందరి విజయం అన్నారు.

12:45 PM
► గుజరాత్‌లో బీజేపీ ఘన విజయంతో సీఎంగా అధికారం చేపట్టనున్న భూపేంద్ర పటేల్‌. కాగా, డిసెంబర్‌ 10 లేదా 11వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు.

► గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓట్‌ షేర్‌.. 26శాతం, ఆప్‌ ఓట్‌ షేర్‌.. 12.7 శాతం

12:10 PM
► గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ విజయం సాధించారు. గట్లోదియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పటేల్‌ ఘన భారీ విజయాన్ని అందుకున్నారు. 

11:40 AM
► గుజరాత్‌లో భారీ విజయం నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. 

11:18 A
► బీజేపీ ఘన విజయంతో గాంధీనగర్‌లో బీజేపీ శ్రేణులు డ్యాన్స్‌ చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నాయి.

10:35 AM

► బీజేపీకి బంపర్‌ మోజార్టీ. బీజేపీ 54 శాతం ఓట్‌ షేర్‌ సాధించింది. వరుసుగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్‌లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 

9:52 AM
► గాంధీనగర్ సౌత్‌లో అల్పేష్‌ ఠాకూర్‌ ముందంజ. మోర్టీలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. విరంగాం స్థానంలో పాటిదార్‌ నేత హార్ధిక్‌ పటేల్‌ లీడ్‌లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

9:33 AM
► ఘాట్లోడియాలో గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ముందంజలో ఉన్నారు. 

9: 25 AM

► 130కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సౌరాష్ట్రలోని కచ్‌ ప్రాంతంలో బీజేపీ భారీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. 

8:53 AM.
 మోర్బీలో బీజేపీ వెనుకంజ
  మోర్బీలో బీజేపీ వెనుకంజ. కాగా, మోర్బీలో ఇటీవలే తీగల వంతెన కూలిపోయి దాదాపు 135 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. దీంతో, ఎన్నికల ఫలితాలపై ఈ ఘటన ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

8:47 AM

► జామ్‌నగర్‌ నార్త్‌లో లీడ్‌లో టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా.

8:30 AM

► పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీకి భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు దక్కాయి. దీంతో, ముందంజలో కొనసాగుతోంది. 

► మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 

► బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. బీజేపీ విజయంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్లుగా గుజరాత్‌లో ఎలాంటి దాడులు, టెర్రరిస్టుల దాడుల జరగలేదు. గుజరాత్‌ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. అందుకే మా పార్టీని గెలిపిస్తారు. 135-145 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.- హర్దిక్‌ పటేల్‌

► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారులు, పార్టీ నేతలు కౌంటింగ్‌ సెంటర్లకు చేరుకుంటున్నారు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్‌’పంచ్‌ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం కావడంతో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. 

 అయితే, పలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు గుజరాత్‌లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆప్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఏడోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. 

మరిన్ని వార్తలు