సెప్టెంబర్‌లో వర్షాలకు సంబధించి వాతావరణ శాఖ అలర్ట్‌!

2 Sep, 2022 12:05 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు ముందుగానే నిష్క్రమించవచ్చంటూ గత వారం వేసిన అంచనాలను వెనక్కు తీసుకుంది. అవి మరికొంతకాలం కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర గురువారం మీడియాకు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం తదితరాలు ఇందుకు కారణమని చెప్పారు.

వాటి ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బిహార్లలో రానున్న రెండు మూడు రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తమ్మీద సాధారణం కంటే 7 శాతం దాకా ఎక్కువ వర్షపాతం నమోదైనా యూపీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, మణిపూర్, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఇది ఖరీఫ్‌ సీజన్లో వరి నాట్లపై బాగా ప్రభావం చూపింది. ఈ లోటును సెప్టెంబర్‌ వర్షపాతం భర్తీ చేస్తుందని మహాపాత్ర ఆశాభావం వెలిబుచ్చారు.
చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో పేలుడు

మరిన్ని వార్తలు