అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్‌నాథ్ సింగ్

1 Oct, 2023 16:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు.   

రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. 

మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.   

ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు.  

ఇది కూడా చదవండి: ఐఎఎఫ్‌ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

మరిన్ని వార్తలు