Tour Package: సింగపూర్‌ ట్రిప్‌కు ఐఆర్‌సీటీసీ బడ్జెట్‌ ప్యాకేజీ

2 Oct, 2023 13:00 IST|Sakshi

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) తాజాగా సింగపూర్‌, మలేషియా టూర్‌ను ప్రకటించింది. భారతదేశంలోని వారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న పర్యాటకులు మలేషియా, సింగపూర్‌లను సందర్శించాలని అనుకుంటారు. అయితే బడ్జెట్ కారణంగా ముందడుగు వేయలేకపోతారు. 

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐఆర్‌సీటీసీ సింపుల్‌ బడ్జెట్‌ ప్యాకేజీలో సింగపూర్, మలేషియాలలో పర్యటించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆహారం పానీయాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఇంగ్లీష్ గైడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ ప్యాకేజీలో పర్యాటకులను ముందుగా భారతదేశం నుండి  విమానంలో సింగపూర్‌కు తీసుకువెళతారు.  తరువాత అక్కడ టాక్సీ ఏర్పాటు చేస్తారు.  విలాసవంతమైన హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు.

ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీకి ఎన్చాంటింగ్ సింగపూర్ అండ్‌ మలేషియా అని పేరు పెట్టింది. ఇది ఫ్లైట్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ 2023 నవంబర్ 20న, అలాగే 2023, డిసెంబర్ 4న ప్రయాణించేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటాయి. ప్యాకేజీలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి. భద్రతా ఏర్పాట్ల  బాధ్యతను ఐఆర్‌సీటీసీ పర్యవేక్షిస్తుంది.

ఈ ప్యాకేజీలో పర్యాటకులు కౌలాలంపూర్‌లోని బటు గుహలు, పుత్రజయ సిటీ టూర్, కౌలాలంపూర్ సిటీ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సింగపూర్‌లో మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్, సెంటోసా ఐలాండ్ వంటి పలు ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా కూడా ఉంది. ఇక టిక్కెట్‌ ఛార్జీల విషయానికొస్తే ఒక్కొక్కరు రూ.1,63,700 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తుల ప్యాకేజీని బుక్ చేస్తే రూ. 1,34,950 చెల్లించాలి. రూ. 1,18,950తో ముగ్గురు వ్యక్తులు ఈ టూర్‌ని  ఎంజాయ్‌ చేయవచ్చు.  
ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!

మరిన్ని వార్తలు