దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు?