ముంభై: కరోనా అన్లాక్ ప్రక్రియ మొదలై అన్ని మెల్లమెల్లగా తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రజా రవాణా సౌకర్యాలు తెరచుకున్నాయి. అయితే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లోకల్ రైళ్లు పట్టాలెక్కలేదు. ఇది సామాన్య ప్రజలకి భారంగా మారుతోంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత సబర్బన్ లోకల్ రైళ్లలో ప్రయాణికులను అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఓ ప్రకటన చేశారు. అయితే రెండు రోజుల అనంతరం అలాంటిదేమీ లేదని సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. క్రిస్మస్ తరువాత స్థానిక రైళ్లపై ప్రభుత్వం నిర్ణయించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయితే, దీనిపై ఎటువంటి స్పష్టత లేదన్నారు. లోకల్ రైళ్లను నడిపే అవకాశం ఇప్పట్లో లేదని సీనియర్ అధికారులు వెల్లడించారు. అయితే, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలు వంటిదని అధికారులు తెలిపారు.
కాగా కోవిడ్ నేపథ్యంలో రైళ్లు నడిపే విషయంలో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. రైళ్లు తీసుకెళ్లే సామర్థ్యం కంటే అధికంగా ప్రయాణికులను తీసుకు వెళుతుంటాయి. అయితే ఇప్పుడు సామర్థ్యం కంటే సగంమంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వాలనుకుంటున్నాం. అయితే దీన్ని అమలు చేయడం చాలా కష్టమని సీనియర్ అధికారి పేర్కొన్నారు.