మహారాష్ట్ర ఆసుపత్రి ఘటన.. డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ

3 Oct, 2023 19:25 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో టాయ్‌లెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు.    

మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య మరో 24 గంటలు గడిచేసరికి 31కి చేరింది. వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు గెలువడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.    

ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం తోపాటు ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే మరణాలు జరిగాయన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వారే వైద్యానికి సరిగ్గా స్పందించడంలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కూడా అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో షిండే ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

     

వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేయగా అక్కడి టాయ్‌లెట్‌ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రి డీన్‌ను పిలిపించి ఆయనతోనే ఆ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయించారు. ఎంపీ అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మరణాలపై దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించామని వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డా.దిలీప్ మైసెఖర్ తెలిపారు.  

ఇది కూడా చదవండి: అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు